న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీకి కాకినాడ బార్ అసోసియేషన్ వినతి
కాకినాడ : న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, న్యాయవాదులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు బుధవారం ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వెంకట్నగర్లోని ఆమె నివాసంలో జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం, ఇళ్ల స్థలాల కేటాయింపు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో వంకాయల శ్రీరామ్మూర్తి, సీహెచ్ఎస్ పార్వతీశ్వరరావు, కర్ర వేణు, మంగా వెంకట శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.