కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

కాకినాడ రూరల్ మండలంలోని హార్బర్‌పేట సముద్రతీరం సినీ సందడితో కళకళలాడింది. మౌంటి ప్రొడక్షన్స్ పతాకంపై జాలర్ల జీవన కథాంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘గర్భసంద్రం’ చిత్రం షూటింగ్ కార్యక్రమం అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నీలిమ మాట్లాడుతూ జాలర్ల కుటుంబాల జీవన పోరాటం, సముద్రంతో వారి అనుబంధం, మాతృసెంటిమెంట్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రావణుడి లంకలో జరిగిన ఒక సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని కథను రూపొందించామని, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పూర్తిగా నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో జాలర్ల జీవితాల్లోని వాస్తవ పరిస్థితులు, వారి కష్టసుఖాలు, కుటుంబ బంధాలు, తల్లి ప్రేమ గొప్పతనం ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ చిత్ర కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని, ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరుగుతోందన్నారు.

కాకినాడ హార్బర్‌పేటతో పాటు చీరాల తదితర తీర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగుతోందని, సహజ సిద్ధమైన సముద్ర వాతావరణంలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. స్థానిక జాలర్ల సహకారంతో చిత్రీకరణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత నీలిమ వెల్లడించారు. షూటింగ్‌ను వీక్షించేందుకు స్థానికులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష