ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ
కాకినాడ : ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామ సర్పంచ్ ఆశా వర్కర్పై చేస్తున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఇన్చార్జ్లు వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. పెద్దిపాలెం పీహెచ్సీ పరిధిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్న పెదలక్ష్మి 2006 నుంచి గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
మొదట ఉల్లి, గోగులమెట్ట, చింత గ్రామాలకు మాత్రమే సేవలు అందించిన ఆమె, అధికారుల ఆదేశాల మేరకు గోకవరం, గిరిజనాపురం ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, గోకవరం సర్పంచ్ కలెక్టర్ గ్రీవెన్స్లో అవాస్తవ ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. తన బంధువులను ఆశా వర్కర్గా నియమించుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సేవల్లో ఉన్న ఆశా వర్కర్ను వేధించడం సరికాదన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లపై రాజకీయ కక్షలతో వేధింపులు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆశా వర్కర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Comments
Post a Comment