ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు అమలు
న్యూఢిల్లీ : ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, పన్ను ఎగవేతలను అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాన్ (PAN) వినియోగంపై కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం కొన్ని అధిక విలువ కలిగిన లావాదేవీలకు పాన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది.
రూ.20 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలు, రూ.2 లక్షలకు పైబడిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు మించిన కొన్ని పెట్టుబడి లావాదేవీలు, అలాగే రూ.5 లక్షలకు మించిన విలువ గల వాహనాల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభించడానికి కూడా పాన్ అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
పాన్ వివరాలు అందించకపోతే సంబంధిత లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని, తప్పుడు వివరాలు సమర్పిస్తే జరిమానాలతో పాటు ఆదాయపు పన్ను శాఖ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు. పాన్ లేని వారు కొన్ని సందర్భాల్లో నిర్దేశిత ప్రత్యామ్నాయ ఫారమ్ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ నిబంధనల ద్వారా అధిక విలువ గల లావాదేవీలపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Comments
Post a Comment