సెల్ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ నిబంధనల ఉల్లంఘనపై ట్రాఫిక్ పోలీసుల కొరడా.. భారీ జరిమానాలు
కాకినాడ: జిల్లా ఎస్పీ విందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎం. కిషోర్ బాబు ఆధ్వర్యంలో బుధవారం టౌన్ హాల్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, ఓవర్స్పీడ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసిన వారికి "గుడ్ సమారిటన్" పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి, ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత ఉచిత చికిత్స, ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా లైన్లు లేని చోట రోడ్డు దాటే విధానం, హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్-1 సీఐ ఎన్. రమేష్తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment