సముద్ర తాబేళ్ల సంరక్షణకు ‘టెడ్’ పరికరాలు కీలకం – ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
కాకినాడ : సముద్ర జీవవైవిధ్య పరిరక్షణతో పాటు మత్స్య సంపద పెంపుదలకు టర్టిల్ ఎక్స్క్లూడర్ పరికరాలు (టెడ్) ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక శిక్షణ, పరిశోధన సంస్థలో శనివారం యాంత్రిక పడవల యజమానులకు టర్టిల్ ఎక్స్క్లూడర్ పరికరాలపై శిక్షణ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సుస్థిరమైన, బాధ్యతాయుతమైన చేపల వేటను ప్రోత్సహించాలని సూచించారు. ట్రాలింగ్ చేపట్టే పడవలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా టెడ్ పరికరాలను అమర్చుకోవాలని, దీనివల్ల సముద్ర తాబేళ్ల రక్షణతో పాటు సముద్ర పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. పర్యావరణహితమైన వేట విధానాలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సమృద్ధిగా మత్స్య సంపద అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఈ పరికరాలను అందిస్తోందని, మత్స్యకారులు వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి. కృష్ణారావు మాట్లాడుతూ యాంత్రిక పడవలకు టెడ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి అని, వాటి వినియోగం వల్ల సముద్ర జీవుల సంరక్షణతో పాటు మత్స్య సంపద వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. అనంతరం ఒక్కో యూనిట్కు రూ.23 వేల విలువైన టర్టిల్ ఎక్స్క్లూడర్ పరికరాలను యాంత్రిక పడవల యజమానులకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు బలసాడి రంగారావు, యాంత్రిక పడవల యజమానుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి నాటి ధర్మారావు, మత్స్యకారులు, పడవల యజమానులు పాల్గొన్నారు

Comments
Post a Comment